అవినీతి; అన్నా హజారే; నా అభిప్రాయాలు

8/23/2011 - రాసింది karthik at Tuesday, August 23, 2011
ప్రస్తుతం దేశం లో అవినీతి పై ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం.. ఈ చర్చలో ఏదో నాకు తోచిన నా రెండు పైసలు ఇలా రాస్తున్నాను..
స్థూలంగా ఈ అవినీతి పై చర్చకు రెండు పార్శాలు..
1. ఒకటి అసలు ఇండియాలో అవినీతిని ఎలా అంతమొందించాలి??
2. రెండవది అన్నా హజారే చేస్తున్నది సబబేనా??
మొదటి విషయానికి వస్తే, మన ప్రియతమ ప్రధానమంత్రి గారూ తన దగ్గర మంత్రదండేమేదీ లేదని, పరిష్కారం కుదరదనీ, తానూ నిమిత్త మాత్రుణ్ణనీ, సెలవిచ్చారు.. ఒక పాత కథలో ఎవరో ఒక పండితుడు కాశీకి పొయ్యి పెద్ద చదువులు చదివి తన సొంత బాష మరిచిపోయాడట, (ఆయనకు తిరిగి తన బాషా జ్ఞానం కలిగించడానికి గాడిదతో తన్నించాల్సి వచ్చిందట.. ఆ కథ మనకెందుకులేండి వదిలేయండి.. మళ్ళీ పెటా సభ్యులు గానీ చూస్తే ఇబ్బంది)  అలా ఉంది మన సింగు గారు చెప్పిన విషయం.. ఇక నా విషయానికి వస్తే, నేను ప్రధానమంత్రినీ కానూ , ఆర్థిక శాస్త్రం అసలు చదువుకోలేదు, హార్వార్డ్ డిగ్రీలు అంతకుముందే లేవు.. కనుక ఎంచక్కా నా ఆలోచనలు రాసేస్తున్నాను.. (మరే నా బ్లాగుకు నేనే సుమన్ :)) .. అవినీతి అనే కాక ఏ విషయం అయినా వ్యక్తి స్థాయిలో మార్పు రాకుండా సమాజం మారాలని ఆశించడం అర్థ రహితం.. ఈ వాదన నేను 100% ఒప్పుకుంటా, కానీ వ్యక్తి స్థాయిలో మార్పు రాలేదు కాబట్టి వ్యవస్థ అలానే ఉండాలని అనుకోవడం ఇంకా ఘోరం.. ఇక వ్యక్తి స్థాయిలో మార్పు అంటామా, అది రావడానికి మన సమాజం పరిస్థితులు ఎలా ఉన్నాయి??  మన విద్యా వ్యవస్థ పతనావస్థ లో ఉంది.. మన విద్యా సంస్థల నుంచీ సాఫ్ట్ వేర్ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్స్ వస్తున్నారేమో కానీ సమాజిక బాధ్యత తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు??  సామాజిక బాధ్యత వరకూ ఎందుకు మన సొంత మనుషుల పట్ల ఎంతమాత్రం బాధ్యతతో ఉన్నాం?? ప్రతీ వందమందిలో నలభై మంది మహిళలు గృహ హింస బారీన పడుతున్నారు (This number might be over rated but 20-25% looks reasonable to me).. ఆడపిల్ల గడపదాటితే ఎవడు ఆసిడ్ పోస్తాడో అని జనాలు భయపడుతున్నారు.. ఇక తల్లి దండ్రులు గురువుల కు మనం చూపిస్తున్న గౌరవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఒక తండ్రీ/గురువు కామెడీ క్యారెక్టర్ కానీ సినిమా వచ్చి ఎన్ని రోజులయింది??  ఇన్ని రుగ్మతలతో ఉన్న ఈ తరాన్నుంచీ అవినీతిని కాక ఇంక ఏమాశించగలం??జవాబు కష్టంగా ఉంది కదూ.. శ్రమ ఎందుకు లేండీ, వదిలేయండి!!
ఒక 3-4 సంవత్సరాల క్రింద మాట, ఒక ప్రఖ్యాత సంస్థ నుంచీ విఖ్యాత కోర్స్ చదివి ఫైనల్ సెమిస్టర్ లో ప్లేస్మెంట్ జరగలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. మూడు రోజుల పాటూ శవం సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ ఉంది.. అంటే మూడు రోజులుగా తమ తోటి విద్యార్థిని మెస్ కు రాలేదు, క్లాసులకు రాలేదు అన్న సృహ కూడా ఎవరికీ కలగలేదు.. ఇంతకంటే ఏం చెప్పాలండీ మన సామాజిక బాధ్యత గురించి??  బాధగా ఉంది కదూ, సరే అయితే వదిలేయండి.    
ఒక రెండు నెలల క్రితం మా నాన్న గారూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచీ పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన రోజు జరిగిన కార్యక్రమం లో దాదాపు 200 మంది పాల్గొన్నారు.. 1987 లో మా నాన్న తో కలిసి పని చేసిన వాళ్ళు కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు.. సో కాల్డ్ MNC ఉద్యోగులూ, ఒక్కసారి ఆలోచించండి మనం పదవీ విరమణ అంటూ చేస్తే (మనకు అంత అదృష్టం కూడానా, పింక్ స్లిప్పులు రాకుంటే అదే చాలు!!) .. ఆ రోజు మనకు Best Wishes అని చెప్పడానికి ఎంతమందికి తీరిక ఉంటుందంటారు?? పోనీ మన పాత టీముల్లో కలిసి పని చేసిన వాళ్ళలో ఎంత మందితో మనం ఫేస్ బుక్ హలో లు కాక మనస్పూర్తిగా బాగున్నావా అని అడిగాము??  మరీ పర్సనల్ గా ఉంది కదూ సరే అయితే ఇది కూడా వదిలేయండి.
ఒక జాతిగా మనం ఎంతగా దిగజారామో మన రాజకీయ నాయకులు కూడా అలానే ఒక్కో మెట్టూ పైకెక్కుతూ మనకు అందని స్టేజికి చేరుకున్నారు. యథప్రజా తథా రాజా.. ప్రజస్వామ్యం కదా అందుకని సామెత కూడా మారింది.  

ఇక ఈ చర్చ లో రెండవ విషయానికి వద్దాం " అన్నా హజారే చేస్తున్నది సబబేనా?? " లోక్ పాల్ తో అద్భుతాలు జరిగిపోవు, ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వాళ్ళల్లో ఎంతమంది లంచాలివ్వకుండా పనులు చేసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న.  నిజమే వాళ్ళల్లో చాలామంది లంచాలిచ్చి అవసరానికి తమ పనులు జరిపించుకుంటూ ఉండవచ్చు కానీ అది వాళ్ళు కావాలని చేస్తున్నారా లేక వాళ్ళ నిస్సహయత అలా చేయిస్తోందా అనేది చూడాలి..  ప్రతీ ఒక్కరికీ లంచాలివ్వకుండా తట్టుకుని నిలబడే స్థోమత/పరపతి/ధైర్యం ఉండాలి కదా.. లంచం ఇవ్వకపోతే అంతులేని జాప్యాలు అర్థం లేని తిరస్కరణలు.. బ్రతుకు భారం తో కృశించిపోతున్న సగటు మనిషి మరింత భారం మోసే పరిస్థితుల్లో లేడు కదా.. దాని ఫలితమే ఈ అవినీతి!! ఈ అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదంటారా?? ఏమో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, నీతి నిజాయితీలు కలిగిన వాళ్ళు మన సమాజం లో ఇంకా ఉన్నారు. వాళ్ళను సమర్థించే వాళ్ళూ ఇంకా ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్లు కాదు, క్రికెటర్లు అసలు కాదు.. మేతావులు అసలే కాదు(అథోగతి రాయ్ గురించి అనుకుంటున్నారా?అయితే మీకు 120 మార్కులు).. వాళ్ళంతా ఊరూ పేరూ లేని Stupid Common Indians.. బాబా రాందేవ్ వెంట అంతమంది నడిచినా, అన్నా హజారే యూత్ ఐకాన్ గా మారినా ఇదంతా వాళ్ళ పుణ్యమే!!


నావరకూ ఫ్రీడం పార్క్ కు వెళ్ళిన రెండు సార్లు చాలా ఆత్మ సంతృప్తి తో ఇంటికి వచ్చాను. ఈ దేశానికి ఇంకా భవిష్యత్తు ఉంది అని నాకు నమ్మకం కలిగించిన ఉద్యమం ఇది.
జై హింద్!!! 


ఈ టపా రాయడానికి ప్రేరణనిచ్చిన టపాలలో కొన్ని: