దొంగ రచయితలున్నారు జాగ్రత్త!!

2/09/2015 - రాసింది karthik at Monday, February 09, 2015
ప్రతీ మనిషికి కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయి.. వాటికి కారణాలు ఉండాలని రూల్ లేదు, కొన్ని సార్లు కారణాలు ఉంటాయి కొన్ని సార్లు ఉండవు. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరు పైత్యపుగాళ్ళు తమను తాము రచయితలని చెప్పుకుంటూ తాము రాసిందే సాహిత్యమని తమ ఆలోచన ధోరణీతో విబేధించేవాళ్ళను నానా తిట్లు తిట్టి తమను తాము మేధావులమని చెప్పుకుని కుతి తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళను ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వ్యక్తిగత దాడి, సంస్కారహీనమైన పనులు అంటూ మాటలు చెబుతారు, వీళ్ళు మాత్రం ఎవరి గురించైనా ఎంత నీచంగా మాట్లాడినా అదంతా ఫ్రీడం ఆఫ్ స్పీచ్, స్వేచ్చ ప్రపంచంలో మనిషికి ఉండే హక్కు. అన్నట్టు మనుషులంటే ఒకానొక విదేశీ భావజాలన్ని నమ్మేవాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా రాతియుగం నాటి జంతువులు.

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సదరు పైత్యపుగాళ్ళకు పబ్లిషర్లు దొరికారు, అంతే! ఇంక చెప్పేదేముంది?? ఇషాంత్ శర్మను చూసిన ఆస్ట్రేలియా బాట్స్ మెన్ లాగా రెచ్చిపోతుంటారు.. పైత్యం ఒకపాలు, ఉన్మాదం మూడు పాళ్ళు ఉన్న వీళ్ళ రచనల దెబ్బకు తెలుగు దేశంలో పుస్తకాలు చదివే వాళ్ళే కరువయ్యారు. ఎవరైనా కొంచెం వెరైటీగా రాస్తే వాళ్ళకు క్షుద్ర రచయితలని బిరుదులు ప్రదానం చేస్తుంటారు. ఇంకొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి "తెలుగు సాహిత్య పతనం యండమూరితో మొదలైంది" అని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు.  ఈ చినవాల్తేరు శాల్తీలందరికి నవల/కథ అంటే ఈ క్రింది లక్షణాలు ఉండాలి:

1. హీరో పేదవాడు అయ్యుండాలి.. అంతే కాక ఆడవాళ్ళ సమస్యల గురించి ప్రతీ అరడజను పేజీలకు ఒక పేజీ స్పీచ్ ఇస్తుండాలి..
2. విలన్ ఖచ్చితంగా బాగా డబ్బున్న వాడు అయ్యుండాలి. నిజజీవితంలో ఎవరూ పెట్టుకోని సర్పభూషణ రావు  లాంటి తింగరి పేర్లు ఉండాలి. అతగాడు హీరోయిన్ తండ్రి అయ్యి హీరో కుటుంబానికి ఏదో తీరని అన్యాయం చేసుండాలి.. ఆ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసేదానికి హీరోయిన్ హీరోని ప్రేమించి తన సమసమాజపు భావజాలాన్ని చాటి చెబుతుంది.
3. డబ్బున్న వాళ్ళందరూ నీతి నిజాయితీ లేకుండా ఉండాలి. వాళ్ళంతా రోజూ బ్రాందీలు విస్కీలు తాగుతూ ఉండాలి. కాగడా వేసి వెతికినా వాళ్ళల్లో ఏ మంచి లక్షణాలు ఉండకూడదు.

ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే అది చెత్త సాహిత్యం, మనిషికి సహజంగా ఉండే బలహీనతలతో ఆడుకోవడం. వీళ్ళు మాత్రం పేర్లు మార్చి, ఊర్లు మార్చి రాసిందే రాస్తూ ప్రజల మీద ఘోరమైన మానసిక దాడులు చేస్తుంటారు. పెషావర్లో తాలిబలు పిల్లల మీద ఒకసారే దాడి చేశారు, ఈ దొంగ రచయితలు మాత్రం ప్రజల మీద కొన్ని దశాబ్దాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. వీటికి తోడు ఎవరైనా వీళ్ళతో కలిసి పని చేయకూడదని అనుకుంటే వాళ్ళ మీద సెటైర్లు అదనం.

ఇప్పటిదాక వీళ్ళు రాసిన చెత్తను ఒకసారి చూసి వీళ్ళు భవిష్యత్తులో ఏం రాస్తారో అని ఒక ఊహించి ఒక లిస్ట్ రాశా, దాన్ని క్రింద చూడండి:

1. తెందుల్కర విషబ్యాటు:
సచిన్ తెందుల్కర్ మహిళా క్రికెట్లో ఆడకుండా పురుషుల క్రికెట్లో మాత్రమే ఆడి స్త్రీ జాతిని ఎలా అవమానించాడు అనేది ఈ నవల కాన్సెప్ట్.

2. ఆగడు సినిమాపై మార్కిస్టు విశ్లేషణ: ఒక పరిశోధనాత్మక వ్యాసం
దీని గురించి వేరే ఏం చెప్పాలి.. పేరు చూస్తేనే భయం వెయ్యడం లేదు.. అనుభవించండి.

3. ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్:
లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలో హాబిట్ గా మగవాడిని పెట్టడం ఎంత ఘోరం ఎంత నేరం. స్త్రీజాతికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి లేదు. ఈ విషయంలో టొల్కిన్ ఎంత నీచంగా ఆలోచించాడు అనే విషయం మీద ఈ నవల.