Facebook నుంచీ కాపీ చేసిన టపా!!!

8/06/2014 - రాసింది karthik at Wednesday, August 06, 2014
Copied from FB



నోరు విప్పితే ఆంధ్రా వాళ్లపై దాడి. దగా- మోసం- కుట్ర…. ఈ మూడు పదాలు నిత్యం రామ నామ జపంలా జపించి తెలంగాణ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచాడు కేసీఆర్. విభజనకు ముందు నిపుణులు, ఏపీ ముఖ్యమంత్రి గొంతి చించుకుని చెప్పారు తెలంగాణ ఆంధ్రమీద, ఆంధ్ర తెలంగాణ మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్ర విభజన ఇరు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అని నెత్తీనోరు మొత్తుకున్నారు. అయినా వినలేదు. మభ్యపెట్టి… ఏదో ఒకలా ఇచ్చేయండని అన్నారు. ఈరోజు తెలంగాణ పొలాలు ఎండిపోయాయి. ఉత్తర తెలంగాణకు రైస్ బౌల్ అని పేరున్న మెదక్ జిల్లా పొలాలు గొంతెండి చూస్తున్నాయి. అవన్నీ బోరు బావుల పంటలు. కరెంటు ఉంటేనే పంటకు నీరు. దీనికి తోడు వర్షాభావం. దీంతో మెట్టరైతులు పంట వేయలేక అన్యాయం అయిపోతే బోరు బావుల కింద రైతులు పంటలు వేసి కరెంటు కోసం చూసి చూసి అది రాక అన్యాయం అయిపోయారు. హైదరాబాదు నగరానికి రోజుకు ఐదు గంటలు కోతలు పెట్టినా, అన్ని జలాశయాలు నిండుకుండలా మారినా తెలంగాణకు అవసరమైన విద్యుత్తు అందడం లేదు. ఎందుకంటే… ఈ పొలాలన్నీ ఇంతకాలం ఆంధ్రా నుంచి వచ్చే విద్యుత్తుతో పండేవి. ఇపుడు అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. ఆ రాష్ట్రం తన అవసరాలు చూసుకోవడంతో తెలంగాణ రైతులు అన్యాయం అయిపోయారు.
దీనికి ఎవరు కారణం?

కచ్చితంగా తొలి దోషి టీఆర్ఎస్. ఎన్నికల ముందు అంత ఆఘమేఘాల మీద విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డున నిలబెట్టాల్సిన పరిస్థితి. తెలంగాణకు కరెంటు ప్రాణం, ఆంధ్రకు రాజధాని ప్రాణం. ఆంధ్రకు రాజధాని పోయి వారు తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోయి నష్టపోతే… తెలంగాణలో ఉన్న వ్యవసాయం, పరిశ్రమలు నడపటానికి కీలకమైన కరెంటును నష్టపోయి ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇంత ఘోరమైన విభజన చేయకపోతే విభజన కు పార్లమెంటు సాక్షిగా డెడ్ లైన్ పెట్టి మూడేళ్లలో ఇటు కరెంటు ఉత్పత్తిని పెంచి, అటు రాజధానిని నిర్మించి రాష్ట్రాన్ని విడదీసి ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలు భరోసాతో జీవించేవారు. రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండేవి. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికార దాహం ఇరు ప్రాంతాల ప్రజల పాలిట శాపమైంది. హైదరాబాదులో వేలసంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచిఉంది. అక్టోబరు నుంచి నిరంతర కరెంటు సరఫరా ఉండే ఆంధ్రకు ఈ చిన్న పరిశ్రమలు తరలిపోయినా పెద్ద ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే వాటిని తరలించడం చాలా సులభం. పైగా వాటికి విద్యుత్తు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్ర మెరుగైన ఆప్షన్ అవుతుంది.

ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాను అడుగుతారు ?

నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా తన తప్పులను పక్కన పెట్టి ఎదుటి వారిని వేలెత్తిచూపడంలో నోబెల్ అవార్డు అంటూ ఉంటే అది కేసీఆర్ నే వరిస్తుంది. అధికారం కోసం అత్యాస పడిన కేసీఆర్ ఇపుడు కరెంటు ఇవ్వడం చేతకాక చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
వీటీపీఎస్ నుంచి 500 ముద్దనూరు నుంచి 210 మెగావాట్లు విద్యుత్తు రావాల్సి ఉన్నా ఆంధ్రా సీఎం అడ్డుకుంటున్నారని రైతులకు ఆయన చంద్రబాబును చూపిస్తున్నారు. మరి ఇదే బుద్ధి ఫీజు రీఎంబర్స్ మెంటు విషయంలో ఏమైంది. మా పిల్లలకే ఫీజులు ఇస్తాం, మీకేం నొప్పి అని బడాయి చెప్పిన ఆయన అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ ప్రజలకు తన సొంత విద్యుత్తు ఇవ్వడంలో తప్పేముంది. తెలంగాణలో దశాబ్దాలుగా స్థిరపడి ఇక్కడే పుట్టి పెరిగిన వారినే పట్టించుకోనపుడు ఆ రాష్ట్రం తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకుంటుంది? ఎందుకు పట్టించుకోవాలి.
విభజన చట్టం ఉల్లంఘించి ఉన్నత విద్యా మండలి పెట్టినపుడు గుర్తురాలేదా అదే చట్టం ఉల్లంఘించి వారు విద్యుత్తు ఆపేయవచ్చని?. ఉమ్మడి రాష్ట్ర జీవోను ఉల్లంఘించి ఆంధ్ర వాహనాలపై పన్ను వేసినపుడు గుర్తురాలేదా… అదే ఉల్లంఘన వారు కూడా చేయగలరని? మా రాష్ట్రం, మా విద్యావిధానం మా ఇష్టం అన్నపుడు గుర్తురాలేదా … వారు కూడా మా రాష్ట్రం మా విద్యుత్తు మా ఇష్టం అంటారని? మాకు కర్ణాటక ఎంతో ఆంధ్రా అంతే అన్నపుడు గుర్తురాలేదా… ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కర్ణాటక ఎంతో, తెలంగాణ అంతే అని అనగలదని.
ఇతర రాష్ట్రాల సీఎంలు మాత్రం తమ ప్రజల ప్రయోజనాలు త్యాగం చేసి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలా? ఎవడు నేర్పిన న్యాయం ఇది! నీ ప్రయోజనాలకు సంబంధించి చట్టం ప్రకారం జరగాలి. ఇతరుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు అయితే కేసీఆర్ ఇష్టం ప్రకారం జరగాలా? విభజనకు ముందు ఆంధ్రోళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అన్న మాటలు మరిచిపోయి ఆంధ్రోడు అన్న మూలం ఎక్కడున్నా వేటాడుతున్న కేసీఆర్ కు ఆ ఆంధ్రోడు ఎందుకు విద్యుత్తు ఇవ్వాలి?

(నోట్ : లాఠీ ఛార్జి జరిగితే తెలంగాణ బిడ్డలను రాక్షసంగా అణచివేస్తారా అన్న కేసీఆర్ ఈరోజు కరెంటు అడిగిన పాపానికి మెదక్ జిల్లాలో రైతులపై లాఠీ ఛార్జి చేయించాడు. పదిమంది రైతులకు ఈ సందర్భంగా తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల తీరుపై రైతులు తిరగబడటంతో రాత్రి పొద్దుపోయాక కేసీఆర్ … దీనికంతటికీ బాబే కారణం అంటూ ఆంధ్ర వైపు వేలెత్తి చూపాడు. ఈ కథనం నేపథ్యం ఇది.)